బతుకుతీపి;- - యామిజాల జగదీశ్
 నిరాశావాదాన్నీ  నిరుత్సాహాన్నీ మన సనాతన  ధర్మం, ఏనాడూ ప్రోత్సహించలేదు.  జీవితం ఎంతో విలువైనదని చాటి చెప్తోంది శ్రీమద్రామాయణంలోని సుందరకాండలో ఓ వాక్యం. అందుకే  అల్పసుఖాల కోసం ఆయువునీ బలాన్నీ వృథా చేయవద్దని  బోధిస్తుంది. ఈ శరీరం,  ధర్మం కోసం లభించిన  గొప్ప సాధనం  అని  ప్రబోధిస్తూ  మంచి అలవాట్లతో,  నియమాలతో దీనిని  దృఢంగా బలంగా మలచుకోవాలనీ, అలాంటి ఆరోగ్యవంతమైన శరీరంలో పవిత్రమైన  మనస్సు  ఉండాలనీ  ఈ రెండూ సాధించడమే నిజమైన  జీవితమని పలు  విధాలుగా తెలియజేస్తోంది.
తాత్కాలిక ఉద్రేకాలకు లోనై జీవితాన్ని నాశనం చేసుకుంటారు చాలామంది. అది తప్పని  చెప్పడానికి ఆణిముత్యాల్లాంటి మాటలు విన్నా చదివినా చాలు. ఆప్తవాక్యం ఇచ్చేంత ఉత్సాహం ఇంతా అంతా కాదు. మంచి మాటలతో ఎంతో  ధైర్యం వస్తుంది. మనమీద మనకు నమ్మకం కలుగుతుంది. క్షణమొక్కటే శాశ్వతం అనిపించేంత భ్రమలో పడకూడదు. భవిష్యత్తులో మేలు కలుగుతుందనే నమ్మకం  చాలా గొప్పది.
భగవంతుడిచ్చిన శరీరాన్ని నాశనం చేసుకునే హక్కు మనకు లేదు. అలా చేసుకుంటే భగవత్‌  శక్తికి కేంద్రమైన దేహాన్ని  ధ్వంసం చేసుకున్న  మహాపాపం  సంక్రమిస్తుంది. దానికి  నిష్కృతి లేదు. నిజంగా జీవితం దుఃఖమయమనిపిస్తే చావు దానికి పరిష్కారం కాదు.  వైరాగ్యం తెచ్చుకుని  సత్కర్మాచరణతో  జ్ఞానాన్ని సంపాదించుకోవడమే నిజమైన సమాధానం.
            మరణిస్తే  దేహాన్ని కోల్పోతాం. కానీ మరో ఉపాధితో  జీవించక తప్పదు. అప్పుడు ఇప్పటి ఆత్మహత్యాపాపఫలాన్ని సైతం అనుభవించవలసిందే. శాశ్వత శాంతిని చేరుకు నేందుకు ఈ జీవితాన్నివినియోగించుకోవాలి. తన కుమారులందరూ విశ్వామిత్రుని  కారణంగా మరణించినప్పుడు  భూదేవి బోధతో క్షణికోద్రేకం  నుంచి  బయటపడ్డ వశిష్టుడు తపస్సు చేసి శివసాక్షాత్కారం పొంది ఆ విశ్వగురువు ప్రసాదించిన బ్రహ్మజ్ఞానంతో సుస్థిర శాంతిని పొందుతాడు. ఇలా ధార్మికంగా లౌకికంగా తాత్త్వికంగా ఆలోచించినా జీవితానికన్నా విలువైనది మరేదీ లేదు. ముందు మనం, అటు తరువాతే లోకం.  బయట వస్తువులపై, వ్యక్తులపై మమకారం ఆశా పెంచుకుని అవి కోల్పోతే  బతుకునే బలి చేసుకోవడం మూర్ఖత్వం.  బయట వస్తువు లభించకముందూ మనం ఉన్నాం. అది పోయినా ఉంటాం. కనుక మనల్ని నాశనం చేసుకునే హక్కు మనకు లేదు. ముందు తాను కలిగితే,  మూడు లోకములు అన్నాడు అన్నమయ్య.  అందుకే ఎంతో  విలువైన జీవితాన్ని జ్ఞానంతో సార్థకం చేసుకోవడమే మన  కర్తవ్యం. ప్రతీ  ఒక్కరు జీవితంలో  ఉత్తమాదర్శాన్ని ఏర్పరచుకొని, కష్టాలను సహించే శక్తిని పెంపొందించుకొని ధైర్యంగా ముందుకు సాగిపోవడమే  మానవుని  గొప్పతనానికి  నిదర్శనం.

కామెంట్‌లు